నవతెలంగాణ – అమరావతి
తిరుమల జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలని చిట్టెంవారి పల్లెకు చెందిన కల్యాణిగా గుర్తించారు. మృతుడు యుగంధర్ చౌడేపల్లి మండలం లద్దికం గ్రామ వాసిగా తేల్చారు. ఈ నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారని, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో భాకరా అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.