నవతెలంగాణ – రంగారెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈ నెల 26న జరగనున్న బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటిస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖర్గే నివాసంలో ఆదివారం భట్టి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతలు భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. ఉదయం 10.50 గంటలకు ప్రారంభమైన భేటీ మధ్యాహ్నం 12.20 గంటలకు ముగిసింది. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. తాము క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అన్ని విషయాలను, అంశాలను క్రోడీకరించి చేవెళ్ల సభలో ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు.