నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మోడీ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై కూడా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించిన మోడీ.. ములాయం సింగ్, లాలూ, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి లాంటి ప్రముఖ నేతలను విమర్శించారు. కాగా.. చివరిలో కేసీఆర్, కవిత గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. కేసీఆర్ కూతురుకు మేలు చేయాలంటే బీఆర్ఎస్కు ఓటేయండని వ్యాఖ్యానించారు. మీ పిల్లలు, మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ సూచించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. అందుకే కవిత పేరును ఛార్జ్ షీట్లలో పలుమార్లు ప్రస్తావించినా.. ఇప్పటికీ అరెస్ట్ చేయట్లేదంటూ ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్న సంకేతాలను జనాల్లోకి పంపించాలన్న ఉద్దేశంతోనే.. ప్రధాని మోడీ బోపాల్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.