నవతెలంగాణ: హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ జోరుమీదుంది. తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ఓలా ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్లో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రారంభించిన రెండు వారాల్లోనే 75 వేలకు పైగా స్కూటర్లకు బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూ ఎస్1 (News S1) సిరీస్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల మధ్య పలుకుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 ఎయిర్ (Ola S1 Air)తోపాటు ఓలా ఎస్1 ప్రో జెన్2 (Ola S1 Pro Gen 2), ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X) స్కూటర్లను తాజాగా ఆవిష్కరించింది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ రూ.1,19,999 పలుకుతుండగా, ఫ్యూయల్ వినియోగంలో కొనుగోలు దారులు ఏటా రూ.23 వేలు (నెలకు రూ.1900), ఎస్ 1 ప్రో రూ.1,47,499లకు లభిస్తుండగా, నెలకు రూ.1100 చొప్పున ఏటా రూ.13 వేలు ఆదా చేయొచ్చు. ఇక ఎస్1 ఎక్స్ (S1 X) స్కూటర్ ధర రూ.89,999-రూ.99,099 కాగా, నెలవారీగా రూ.2,600 చొప్పున ఏటా రూ.30 వేల వరకు పొదుపు చేయొచ్చు. ఈ నెల 15న ఓలా ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో ఎస్1ఎక్స్ – ఎస్1ఎక్స్+, ఎస్1ఎక్స్ (2 కిలోవాట్స్), ఎస్1ఎక్స్ (3 కిలోవాట్స్) ఆవిష్కరించింది. వీటితోపాటు సెకండ్ జనరేషన్ స్కూటర్ ఎస్1 ప్రో జెన్ 2 స్కూటర్ కూడా ఆవిష్కరించింది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 120 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.