నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. శృంగవరపు కోటలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన విశాఖలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఓపెన్హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్లోని ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.