నవతెలంగాణ – హైదరాబాద్
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 290 మందికిపైగా మరణించగా.. 1,100 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైల్వేలో రిస్క్ అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్లో కోరారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సదరు నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్ యివారీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పశ్చిమబెంగాల్కు చెందిన బాధితులను కోల్కతా చేర్చేందుకు భువనేశ్వర్, కటక్, పురి ప్రాంతాల నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడి నుంచి కోల్కతాకు రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రయాణ ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి భరిస్తుందని ఒడిశా సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో మరణించిన వారిలో అత్యధిక మంది పశ్చిమబెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతానికి చెందిన దక్షిణ 24 పరగాణల జిల్లాకు చెందిన వారున్నారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి జాబితాను ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్సైట్లలో అప్లోడ్ చేసింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వెబ్సైట్లలో ప్రయాణికుల ఫొటోలు ఇతర వివరాలను కూడా పొందు పర్చినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.