నవతెలంగాణ – వరంగల్: చిన్నగా ప్రారంభమైన గాలి దుమారం క్రమంగా బీభత్సాన్నే సృష్టించింది. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో శనివారం రాత్రి అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షంతో వరంగల్ నగరంతో పాటు నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో ప్రజలు వణికిపోయారు. వరంగల్ తూర్పులోని కాశీబుగ్గ గాంధీనగర్, చింతల్, జేబీనగర్, ఆర్ఎస్నగర్, చార్బౌలి తదితర ప్రాంతాల్లో 150 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరి పోయాయి. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 50 స్తంభాలు కింద పడి విద్యుత్తు సరఫరా ఆగింది. వందల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. పలుప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నల్లబెల్లి మండలంలో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పలు ఇళ్ల పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయి మొండిగోడలు మిగిలాయి. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఈ క్రమంలో డీఆర్ఎఫ్ టీం ఎంట్రీ ఇచ్చింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. కాశీబుగ్గ, ఓ సిటీ, ఖిలావరంగల్, చింతల్ మైసమ్మ గుడి వద్ద కూలిన వృక్షాలు, చెట్లను తొలగించారు.