నవతెలంగాణ – హర్యానా
మతఘర్షణలతో ఇప్పటివరకూ అట్టుడికిన హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. దాదాపు రెండు వారాల తరువాత మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎమ్ఎస్, బ్రాడ్బ్యాండ్ సేవలను పునరుద్ధరించారు. జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మత ఘర్షణలు చెలరేగడంతో జులై 31న ఈ సేవలపై నిషేధం విధించారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న ఓ మతపరమైన ఊరేగింపును కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. గోరక్షకుడు మోనూ మనేసర్ ఈ ఊరేగింపులో పాల్గొంటాడన్న వార్త ఉద్రిక్తతలకు నాంది పలికింది. ఈ గొడవల్లో ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఘర్షణలో మరణించిన వారిలో ఇద్దరు హోం గార్డ్స్, ఓ ముస్లిం మతపెద్ద ఉన్నారు. నూహ్ జిల్లాతో పాటూ చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, పల్వాల్, ఫరీదాబాద్, హర్యానాలోని ఇతర జిల్లాలకూ ఈ గొడవలు వ్యాపించాయి. పలుప్రాంతాల్లోని షాపులు, ఫుడ్ జాయింట్స్ దుడుకు మూకల దాడిలో నాశనమయ్యాయి. కాగా, ఈ గొడవల్లో మనేసర్ పాత్ర ఏంటో తేల్చేందుకు సిట్ ఏర్పాటు కానుంది.