– కొడుకు మరణం… తల్లికి చెప్పని కుటుంబం
– అప్పుల భాదతో నేతన్న బలన్మరణం
నవతెలంగాణ- సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం పద్మనగర్ కు చెందిన మంగలపల్లి సాయి అనే నేత కార్మికుడు అప్పుల బాధ భరించలేక మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… పట్టణంలోని నేత కార్మికుడు మంగళపల్లి సాయి కి చాలా అప్పులు అయ్యాయి. సాయి తండ్రి లక్ష్మణ్ పక్షవాతానికి గురై మంచం నుండి లేవకుండా ఉన్నాడు. తల్లి చిలుకమ్మ గుండెజబ్బుతో బాధపడుతూ మంచాన పడింది. నిరుపేద నేత కుటుంబానికి చెందిన సాయి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగు చేయడానికి సుమారు పది లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక చేతినిండా పని లేక మనోవేదనకు గురైన సాయి ఏం చేయాలో తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు మృతుడు సాయికి ఇద్దరు కూతుళ్లు ఉష, శ్రీవానీ, ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది మంచాన పడి ఉన్న తల్లి చిలకమ్మకు ఇప్పటివరకు సాయి చనిపోయిన విషయం చెప్పలేదు, చెబితే తన ప్రాణానికి ప్రమాదం అని బంధువులు భావిస్తున్నారు. ఎవరైనా దాతలు మంగళపల్లి సాయి కూతుళ్ళ భవిష్యత్తుకి సాయం చేయాలని వేడుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.