నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని రంగాపూర్ గ్రామంలో పారిశుద్ధ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక సర్పంచ్ ఇరుప అశ్విని సూర్యనారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఎర్రంకని భార్గవ్ లు దగ్గర ఉండి ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వాతావరణ మార్పులు, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం క్షీణించి, దోమలు విజృంభించి సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందస్తు చర్యల్లో భాగంగా మురుగు నీటి కాలువలను మరియు ప్రధాన వీధులను శుభ్ర పరిచారు. గ్రామంలో కాలువలు శుభ్రపరిచిన అనంతరం కాలువలలో మరియు నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లి దోమలు వ్యాప్తి చెందకుండా అరికడుతున్నారు. అనంతరం ప్రధాన వీధులలో హైపో ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఇరుప అశ్విని సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి భార్గవ్ లు మాట్లాడుతూ ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన తడి చెత్త మరియు పొడి చెత్త డస్ట్ బిన్ లను వాడి పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.