– ఇబ్రహీంపట్నం గడ్డపై ఎర్రజెండా ఎగురవేద్దాం
– కార్మికులు, కర్షకులు, కూలీలు సీపీఐ(ఎం)కే మద్దతు ఇవ్వాలి
– ఊరురా జోరుగా సీపీఐ(ఎం) కార్యకర్తల ప్రచారం
నవతెలంగాణ-యాచారం
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవకాశవాద రాజకీయాలను ప్రజలంతా ఓటుతో తిప్పికొట్టి, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్ పిలుపునిచ్చారు. బుధవారం యాచారం మండల పరిధిలోని చిన్నతుండ్ల, ధర్మన్నగూడ, నల్లవెల్లి, చింతపట్ల, నానక్ నగర్, కొత్తపల్లి, మేడిపల్లి గ్రామాల్లో సీపీఐ(ఎం) నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల పక్షాన నిలబడే ఎర్రజెండా సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఊరురా పార్టీ నాయకులు, కార్యకర్తలు తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ శాసనసభ ఎన్ని కల్లో డబ్బు రాజకీయాలు, అధికార వ్యామోహం, మద్యం సీసాలతో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇండ్లు, రేషన్ కార్డు రాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలంతా చిత్తుగా ఓడించాలని కోరారు. పేద ప్రజల పక్షాన నిలబడే సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యను అధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శిలు ఎంజే. వినోద్కుమార్, గోపిక శ్రీనివాస్, పార్టీ వార్డు సభ్యురాలు మస్కు జంగమ్మ, సీనియర్ నాయకులు ఎం. విజరు కుమార్, కె. వినోద్ కుమార్, సామర్థి జగన్, మస్కు అరుణ, సంజీవ, బుగ్గ రాములు, జంగయ్య, యాదగిరి, రూపేందర్, భగత్, భూషణ్, రవికుమార్ పాల్గొన్నారు.