నవతెలంగాణ- కంఠేశ్వర్: ఎస్ఎఫ్ఐ నిజాంబాద్ నగర 15 మహాసభను జయప్రదం చేయండి అని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు వాగ్మారే విశాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీ నగర్ నందు గల బాలుర ఐటిఐ కళాశాల నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు వాగ్మరే విశాల్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ 15వ మహాసభలు ఈనెల సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ నగర కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభల్లో గత కార్యక్రమాల సమీక్ష భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని ప్రభుత్వ విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధి చేయాలని సమరశీల పోరాటాల కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా వృతివిద్య అయిన ఐటిఐ కాలేజీలో నేడు సరైన పరికరాలు లేక విద్యార్థులకు సరైన భోధన జరగడం లేదన్నారు. అలాగే ఐటిఐ లో కోర్సు పూర్తి అయినాక పేరున్న కంపెనీస్ అప్రెంటిస్ కొరకు అనుకున్న స్థాయిలో రాకపోవడం వలన, విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ సమస్యల పరిష్కారం కొరకు కృషి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గణేష్, నగర నాయకులు ఉద్ధవ్, శివ ఐ టి ఐ, ఎస్ ఎఫ్ ఐ కాలేజీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.