నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. పలు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బకరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణ అన్నదమ్ములు. అయితే కాజీపేటలో సోదరుడిని ట్రైన్ ఎక్కిచేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నదమ్ములు ప్రయాణిస్తున్న బైక్ను హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అన్నాసాగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి సమీపంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరంగల్ నగరానికి చెందిన అన్నదమ్ములు ఆశిష్, అభిషేక్ మృతి చెందారు. టేకుమట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగిర్తిపేట స్టేజీ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో తాత, మనువరాలు మృతి చెందారు. తాత, మనువరాలు వెళ్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.