నవతెలంగాణ – అమరావతి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం చిత్తూరు జిల్లాలో కలకలానికి దారితీసింది. బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్లోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మానస అనే గర్భిణి.. ఆ అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్వాడీ సూపర్వైజర్ రెడ్డి కల్యాణితో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా, ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు.