నవతెలంగాణ – విశాఖపట్నం: ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సీతంపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన పి.రాంప్రసాద్ (30) ఉద్యోగ రీత్యా విశాఖ సీతంపేట గణేశ్నగర్లో ఓ ఇంట్లో అద్దెకు నివశిస్తున్నాడు. శంకరమఠంలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి స్నేహితుడి ద్వారా సమాచారం అందుకున్న ద్వారకా స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతుడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో ప్రేమ వ్యవహారం కారణంగానే చనిపోతున్నట్లు ఉందని ఎస్.ఐ ధర్మేంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.