నవతెలంగాణ – హుజూర్నగర్
గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగింది. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంకు చెందిన వీరాచారి, ధనలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె జిలోజి శివాని(14) గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే నెల రోజులుగా గురుకులంలోని కొంతమంది విద్యార్థినులు..ప్రభు త్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడడం, వారి ఇన్స్టాగ్రామ్ ఐడీలు తీసుకుని తరుచూ చాటింగ్లు, కాల్స్ వంటివి చేస్తున్నారు. దీంతో 8మంది విద్యార్థినుల వ్యవహారశైలి బాగాలేదని గుర్తించి, వారిని ఇంటికి తీసుకెళ్లాలని వారి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారమిచ్చారు. వారిలో ఏడుగురిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లారు. అయితే లారీడ్రైవర్గా విధుల్లో ఉండటంతో రెండు రోజుల్లో వస్తానని శివాని తండ్రి ప్రిన్సిపాల్కు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తరగతి గదిలోని ఫ్యాన్కు శివాని ఉరేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.