నవతెలంగాణ-హైదరాబాద్ : పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరిగింది. మధ్యాహ్నం 33-35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు గ్రేటర్లో నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఆఫీసులు, ఇండ్లలో ఏసీల వాడకం అధికమై విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది అక్టోబర్లో రోజు వారీ డిమాండ్ 53 మిలియన్ యూనిట్లుగా నమోదైతే ఈ యేడాది 65 మిలియన్ యూనిట్లకు చేరింది. సాధారణం కంటే 20 శాతం డిమాండ్ అధికంగా నమోదవుతోంది. సైబర్సిటీ, హబ్సిగూడ, మేడ్చల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్ సర్కిళ్లలో గతంతో పోల్చితే విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ విభాగం అధికారులు చెబుతున్నారు.