నవతెలంగాణ – హైదరాబాద్: విప్లవ కవి, రచయిత, ప్రజా గాయకుడు గద్దర్ (అలియాస్ విఠల్ రావు) గుండెకు సంబంధించిన సమస్యలతో హాస్పిటల్లో చేరి చికిత్సపొందుతూ ఈరోజు మరణించారు. గద్దర్ మరణం పట్ల తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లిటరరీ ఫెస్ట్ లకు విచ్చేసి తన పాటతో, మాటతో సాహిత్యకారులలో ఉత్సాహాన్ని నింపారు.
అణగారిన వర్గాలకోసం అనేక పాటలు రాయడంతో పాటు తన ఆట, పాట ద్వారా ‘ప్రజా యుద్ధనౌక’గా పేరుపొందారు. మా భూమి సినిమా లో ఆయన పాడిన బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పాట నేటికీ చిరస్థాయిగా నిలిచింది. ఆయన వేషధారణ ప్రజలను ఆకర్షించేది. గద్దర్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. గద్దర్ మరణం పట్ల తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె.ఆనందాచారి సంతాపం వ్యక్తం చేసారు.