నవతెలంగాణ-రాయపోల్: సంస్కృతి సంప్రదాయాలను మరచిపోతున్న నేటి కాలంలో వాటిని గుర్తు చేయడం పాఠశాల కర్తవ్యంగా భావిస్తూ ప్రాచీన సంప్రదాయం సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య అన్నారు. గరువారం రాయపోల్ మండలం వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య మాట్లాడుతూ తంగేడు, గునుగు, చామంతి తోపాటు తీరొక్క పూవులతో బతుకమ్మ తయారుచేసి కోలాటాలతో బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూవోలే తీసుకువచ్చి పాఠశాలలోనే రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి తయారు చేశారు. తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని,అందులో భాగంగానే చిన్నారి విద్యార్థులకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించుటకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో బతుకమ్మ సంబరాలకు సహకరించిన తల్లిదండ్రులకు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటల్లో పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బతుకమ్మలను ఆటపాటలతో చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయరాలు రజిని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.