నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.