నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీలోని ఈటల రాజేందర్ వంటి ఉద్యమనేతలే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిదని, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పార్టీలోకి తిరిగి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నన్ను తిట్టినా పట్టించుకోను… క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని వెళ్లిపోయినవారు వెనక్కి రావాలని ఆయన సూచించారు.