నవతెలంగాణ-హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతిమ యాత్ర చేపట్టారు. స్మశానం వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉండడంతో పాడె మోస్తున్న నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తిరుపతి, మునెప్ప, గుంటూరు కు చెందిన రవీంద్రన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.