– సీపీఐ(ఎం) పొలిట్ బూర్యో సభ్యులు నిలోత్పల్ బసు ఘనంగా అమరవీరులకు నివాళి
జలంధర్: ఘాద్రి ఉద్యమ వారసత్వాన్ని సీపీఐ(ఎం) దేశం నలుమూలలకు తీసుకుని వెళుతుందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు తెలిపారు. ఘాద్రి అమరవీరులకు నివాళులర్పించేందుకు సీపీఐ(ఎం) పంజాబ్ రాష్ట్ర కమిటీ గురువారం భారీ సదస్సు నిర్వహించింది. లాహోర్లోని సెంట్రల్ జైలులో 1915 నవంబర్ 16న ఏడు మంది ఘాద్రి వీరులకు ఉరిశిక్ష విధించారు. గురువారం ఘాద్రి అమరవీరులకు నివాళులర్పించిన నీలోత్పల్ బసు సదస్సులో మాట్లాడుతూ ఘాద్రి విప్లవకారుల, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వారసత్వాన్ని దేశంలోని ప్రతి పల్లెకు, పట్టణానికి తీసుకెళ్లాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. కాలాపానీ అని పిలిచే అండమాన్- నికోబార్లోని జైలుకు వెళితే అక్కడ విప్లవకారుల జాబితా ఉందని, జాబితాలో ఎక్కువ మంది పంజాబీలు, బెంగాలీలు ఉన్నారని చెప్పారు. అలాగే ‘గద్రర్ పార్టీ విదేశీ గడ్డపై కార్యక్రమాలు నిర్వహించింది. స్వాతంత్య్ర పోరాటంలో గద్రర్ ఉద్యమం ఆదర్శప్రాయమైన పాత్రను పోషించింది. వీరంతా గొప్ప గొప్ప త్యాగాలు చేశారు’ అని నిలోత్పల్ బసు గుర్తు చేశారు. ఫాసిస్ట్ ఇజ్రాయిల్ చేస్తున్న కనికరం లేని దాడుల్లో బలి అవుతున్న అమాయక పాలస్తీనియన్లకు సంఘీభావంగా నిలబడాలని నీలోత్పల్ బసు ప్రజలకు పిలుపునిచ్చారు. నాటో బలగాలు, అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్కు సాయం చేస్తున్నాయని విరించారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకూ దాదాపు 12,000 మంది అమాయకులు చనిపోయారని, మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని బసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్కు మద్దతుగా ఉన్న భారత ప్రభుత్వంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాలస్తీనాతో దశాబ్దాల కాలంగా ఉన్న సంఘీభావాన్ని భారత ప్రభుత్వం వదులుకుందని విమర్శించారు. ఘాద్రి అమరవీరులకు నివాళులు అర్పించిన సీపీఐ(ఎం) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి సుఖ్వీందర్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ ఘాద్రి విప్లవకారుల వారసత్వాన్ని పంజాబ్లోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశం చాలా క్లిష్టమైన సమయంలో ఉందని అన్నారు. అధికార పార్టీలు ప్రజలను మత, కులాల వారీగా మభ్యపెడుతున్నాయని విమర్శించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్య రంగం పూర్తిగా విస్మరించబడిందని, మోడీ ప్రభుత్వం క్రోనీ క్యాపిటలిస్టుల కోసం మాత్రమే పనిచేస్తోందని విమర్శించారు. పంజాబ్లో మాదకద్రవ్యాల వ్యాప్తి, అక్రమ మైనింగ్, గ్యాంగ్ వార్లు, శాంతి భద్రతలు క్షీణించం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. లాహోర్లోని సెంట్రల్ జైలులో 1915 నవంబర్ 16న లాహోర్ కుట్ర కేసు ఆరోపణలతో ఏడు మంది ఘాద్రి వీరులకు ఉరిశిక్ష విధించారు. కర్తార్ సింగ్ సరభా, విష్ణు గణేష్ పింగ్లే, సురైన్ సింగ్ సీనియర్, సురైన్ సింగ్ జూనియర్, బక్షిష్ సింగ్, జగత్ సింగ్, హర్నామ్ సింగ్ సియాల్కోటిలను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ కేసులో మొత్తంగా 291 మందిపై అభియోగాలు మోపారు. వీరిలో 42 మందికి మరణశిక్ష విధించారు. 114 మందికి జీవిత ఖైదు, 93 మందికి వివిధ రకాల జైలు శిక్షలు అమలు చేశారు. విచారణలో 42 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.