– ఆమ్ ఆద్మీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు
డాక్టర్ దిడ్డి సుధాకర్ వెలడి
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఆమ్ ఆద్మీ భావజాలం, నిజాయితీ, దేశభక్తి, మానవత్వం చూసి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు వంద మంది నేతలు, కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ వెల్లడించారు. శుక్రవారం హిమాయత్నగర్, లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీకాంత్, సినీ నిర్మాత సామాజిక నాయకులు రాజీవ్, బీసీ సంఘం నాయకులు వడ్డెర నరసన్న, ఏబీవీపీ నాయకులు కరుణాకర్ తదితరులను డాక్టర్ దిడ్డి సుధాకర్, బుర్ర రాము గౌడ్, భూక్యా శోభన్ కంండువాలు కప్పి ఆమ్ ఆద్మీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి నిజాయితీగా పోరాడి గెలవగలమని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించిందన్నారు. సామాన్య ప్రజల సౌలభ్యం కోసం ఉచిత పాఠశాలలు, నీరు, విద్యుత్, మెరుగైన రహదారి కనెక్టివిటీ మొదలైన వాటి వరకు అవినీతిని సహించకపోవడం నుంచి అనేక అంశాల్లో తన సామర్థ్యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించుకుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఆప్ పాలనా విధానం పట్ల ప్రజలు ఆకర్షితులవుతూ దేశవ్యాప్తంగా ఆప్లో చేరుతున్నారని చెప్పారు. ఆప్లో చేరి దేశంలో రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పప్పుల సుధాకర్, సయ్యద్ గఫార్, సర్దార్ రణధీర్ సింగ్ రాణా, ప్రవీణ్ కుమార్ యాదవ్, రీక్షన్ రావణ్, కొడంగల్ శ్రీనివాస్, టి.రాకేష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.