నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి సీపీఐ(ఎం) ముషీరాబాద్ అభ్యర్థి దశరథ్ను గెలిపించాలని సీపీఐ(ఎం) నాయకులు రాములు ప్రజలను కోరారు. రాములు ఆధ్వర్యంలో గురువారం నియోజక వర్గంలోని బాగ్ లింగంపల్లి సరోజిని నగర్ లో పాదయాత్ర చేస్తూ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజాసమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం. దశరథ్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.