– 10వ తేది నుంచి రంగంలోకి
నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణా ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యవేక్షించనున్నారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తారు. వీరంతా ఈ నెల 10 నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే 60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రారంభంతో వ్యయ పరిశీలకులు శుక్రవారం నుంచి రంగంలోకి దిగనున్నారు.