నవతెలంగాణ – హైదరాబాద్: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే, ఆ తర్వాత మరో వారం రోజులు అంటే అక్టోబర్ 7 వరకు గడువు పెంచింది. పెంచిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆదివారం నుంచి రూ.2 వేల నోటు ఒక చరిత్రగా మిగిలిపోనుంది. ఈ నోట్ల మార్పిడికి ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన నేపథ్యంలో మరోసారి ఆ అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇక అక్టోబర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జమచేయడం, లేదా ఇతర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్ను నిలిపివేస్తాయని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొంది. అందువల్ల ఇప్పటికీ పెద్ద నోటును మార్పిడి చేసుకోనివారు ఈరోజు సాయంత్రంలోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.