నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ మ్యానిఫెస్టోను ఈ నెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సిరిసిల్లలో, గజ్వేల్, కామారెడ్డిలో తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్ దూరాలని చూస్తోందన్నారు. గురువారం హైదరాబాద్లోని హోటల్ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 60 లక్షలకుపైగా ఉన్న యువత ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారారని చెప్పారు. నిరుద్యోగులు వాడవాడలా కేసీఆర్ ప్రభుత్వ మోసాలను వివరిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీలో 25 లక్షల మంది యువకులు తమ పేర్లను నమోదుచేసుకుని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయిగానీ యువతకు రాలేదని చెప్పారు.