నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు అమిత్షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఐటీసీ కాకతీయలో ఆయన విశ్రాంతి తీసుకుని 18న ఉదయం 10:30కు హోటల్ కత్రియాలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత సకలజనుల విజయ సంకల్ప సభల్లో(గద్వాల, నల్లగొండ, వరంగల్)లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లోని క్లాసిక గార్డెన్లో ఎమ్మార్పీఎస్, దాని అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తదనంతరం ఆయన అహ్మదాబాద్కు వెళ్లిపోతారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు 19న నారాయణపేట, చేవెళ్ల బహిరంగ సభల్లో, సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్తారు.