– సంపద పెంచి పేదలకు పంచడమే మా నినాదం
– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-నాగోల్
అన్ని వర్గాలను, అన్ని రంగాలను, అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు .మంగళవారం నాగోల్ డివిజన్లోని దేవకీ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వివర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఎల్ .రమణ, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరు ప్రవీణ్ ,చేనేత కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లా డుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుప డ్డాయని, కరెంటు సమస్యలు అప్పుడెలా ఉండెనో ఇప్పుడు ఎలా ఉందో మీకంతా తెలుసు నని నేడు చాలినంత కరెంటును ఇచ్చుకొని సాగు, తాగునీరు సమస్యలను తీర్చుకున్నామని పేర్కొన్నారు.మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నామని ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు తదితర ప్రాంతాల్లో పట్టిపీడిస్తున్న ప్లోరోసిస్ సమస్యను పరిష్కరిం చుకోగలిగామని తెలిపారు.జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ లను ఏర్పాటు చేసి ఎక్కడి వాళ్ళకక్కడే వైద్యం అందిస్తున్నామని, రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలను పెట్టి పేద బిడ్డలకు ఉచితంగా విద్యనందిస్తున్నామని అన్నారు.గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తాము చేసింది ఆరున్నర సంవత్స రాలు మాత్రమే పని అని.. మమ్ములను 65 ఏండ్లు పాలించిన వారు అడుగుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ళు చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం కాదని అన్నారు. కొత్త సీసాలో పాత సారా అనే విధంగా 2009లో 9 గంటల విద్యుత్తును అందించలేని కాంగ్రెస్ నాయకులు మళ్లీ వస్తున్నారని ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకు ఎందుకన్నారు. దఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకోవాలని మంత్రి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచి, పేదలకు పంచడమే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ఇది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వమన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం తధ్యమని చెప్పారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఉన్న 3 వేల చేనేత మిత్ర ను ఐదు వేలకు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.అదేవిధంగా చేనేత రుణమాఫీ తో పాటు నేతన్నల కోసం ఇంకా ఏమైనా చేయాలని ఆలోచన తో పనిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ తాను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు చేనేత కార్మికుల బాధలు ఇంత అంత కాదన్నారు. కానీ నేడు రాష్ట్రంలో 75 సంవత్సరాల లో సాధించని ప్రగతిని ఇప్పుడు సాధించుకున్నామన్నారు. గత కేంద్ర ప్రభుత్వాలు చేనేత లకు ఎంతో కొంత నిధులను అందించి ఆర్థిక భరోసాని ఇచ్చేదని కానీ ఈ నేడు ఈ మోడీ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హ్యాండ్లూమ్స్ అడ్వైజర్ బోర్డు తో సహా అనేక చేనేత కార్మికుల పథకాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు మన చేనేతల కోసం ఆలోచన చేస్తున్నారని ఇప్పటికే చేనేత రంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడంతో నాడు వర్కర్గా ఉన్నవారు నేడు యజమానులుగా అయ్యారని ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నిదర్శనమని అన్నారు.చేనేత కార్మికులంతా సమైక్యంగా ఐక్యం గా మెలుగుతూ మనకోసం పనిచేసే ,మన ఆర్థిక అభివద్ధి కోసం పాటుపడుతున్న బి.ఆర్.ఎస్ పార్టీని ఆదరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన చేనేత కార్మికులను కోరారు.