– మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్, ఫోరెన్సిక్ టీమ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బజార్ ఘాట్లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బజార్ఘాట్కు చెందిన వ్యాపారవేత్త రమేష్ జైశ్వాల్కు చెందిన బాలాజీ రెసిడెన్సీ (జీ ప్లెస్ ఫోర్) నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. అక్రమంగా సెల్లార్లో కెమికల్స్ డ్రమ్స్ నిల్వఉంచడం, ఎలాంటి నిబంధనలూ పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరగ డానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీ సులు నిర్థారణకు వచ్చారు. సెల్లార్ నుంచి రగులుకున్న మంటలు అక్కడ అక్రమంగా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెంజీన్ నైట్రేట్ ద్రావణానికి అంటుకోవడంతో చూస్తుండగానే దట్టమైన పొగతో నిమిషాల వ్యవధిలోనే మం టలు వ్యాపించాయి. నిప్పురవ్వతోనే మంటలు చెలరేగి, రసాయనాల కారణంగా భవనం మొత్తం మంటలు వ్యాపించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అపార్టుమెంట్ యజమాని రమేష్ జైశ్వాల్పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే సంఘటన తర్వాత ఆయన ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆయన డిశ్చార్జ్ కాగానే పోలీసులు ఆయనను విచారించనున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా మరో 10మంది ఆపస్మారక స్థితికి చేరుకుని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్స్
మంగళవారం మరోసారి క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఫైబర్ ఎయిర్ కూలర్ల బాడీలు తయారీకి వినియోగించే బెంజైల్ నైట్రేట్ (మిథైల్ బెంజిన్) డబ్బాలు, గేట్లకు వాడే షీట్లు(పాలీ షీట్లు), ప్లాస్టిక్ కార్పెట్లు, రెజిన్ రసాయనం డ్రమ్ములు నిల్వఉంచినట్టు తేల్చారు. అన్ని విషయాలను పరిశీస్తున్న ఈ బృందాలు కొన్ని నమూనాలను సేకరించారు. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ సమీపంలోని మరో అపార్టుమెంట్లో రమేష్ జైశ్వాల్కు ఇలాంటిదే మరో గోదాంను పోలీసులు గుర్తించారు. అక్కడున్న కార్యాలయం నుంచి కొన్ని కీలక పత్రాలను సేకరించినట్టు తెలిసింది. ఇదిలావుండగా మంటలతాకిడికి గ్రౌండ్ ఫ్లోర్లోని ప్లాస్టిక్ షీట్లు, బండిళ్లు కరిగి రోడ్డుపై ద్రవం రూంపలో పారాయి. రోడ్డుపై ఆయిల్ పారుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది మట్టి పోశారు. భవనంలోని మిగిలిన ఆయిల్ డ్రమ్ములను జీహెచ్ఎంసీ సిబ్బంది బయటకు తీశారు.