నవతెలంగాణ – చెన్నై
కార్మికుల మెరుపు సమ్మె కారణంగా చెన్నైలో సోమవారం కొద్దిసేపు ఎంటీసీ బస్సులు హఠాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీసీ) చెన్నైలో సాధారణ, ఎక్స్ప్రెస్, డీలక్స్, ఏసీ బస్సులు నడుపుతోంది. సోమవారం సాయంత్రం కార్మికులు ఉన్నట్టుండి సమ్మెకు దిగడంతో హఠాత్తుగా ఎంటీసీ బస్సులు డిపోలు, బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. టి.నగర్, మందవెల్లి, సైదాపేట, కే.కే.నగర్, వడపళని, అశోక్నగర్, కోయంబేడు, పెరంబూర్ సహా పలు ప్రాంతాల్లోని డిపోలు, బస్టాండ్లలో ఎంటీసీ కార్మికులు హఠాత్తుగా నిలిపివేశారు. వేసవి సెలవుల్లో షాపింగ్ కోసం వచ్చిన వారు, కార్యాలయాల పని వేళలు ముగించుకొని తిరిగి వెళ్లే వారు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంటీసీ బస్సు సేవలు సాయంత్రం 6 గంటలకు పునరుద్ధరించారు. ఆందోళన చేపట్టిన కార్మిక సంఘాల నేతలతో రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మంత్రి, అధికారుల హామీతో కార్మికులు ఆందోళన విరమించారు. దీంతో, బస్సు సేవలు యధావిధిగా సాగాయి.