– పటాన్చెరువు సీపీఎం అభ్యర్థి మల్లికార్జున్ను గెలిపించండి
– సీపీఎం నాయకుల ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ – గుమ్మడిదల
పోరాటాల ఎర్రజెండా పటాన్చెరువు నియోజకవర్గ అభ్యర్థి మల్లికార్జున్తోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం అన్నారు. గురువారం సీపీఎం నాయకులు గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరభద్ర నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతమైన బొంతపల్లి, వీరభద్రనగర్ తదితర గ్రామాలలో కార్మికవర్గం, కర్షక లోకం, వివిధ రాష్ట్రాల ప్రజలు, పరిశ్రమలలో పని చేస్తున్న ప్రతి ఒక్కరి సమస్యలను సీపీఎం పరిష్కరిస్తుందని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఎం అభ్యర్థి జె.మల్లికార్జున్ను గెలిపించాలని, సుత్తే కొడవలి సుక్క గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎందరో నిరుద్యోగులకు ఉద్యమాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత కేవలం సీపీఎం పార్టీకే దక్కుతుందన్నారు. ఇంటింటి ప్రచారంలో సీపీఎం నాయకులు జగన్, రవి, హుస్సేన్, సురేందర్ రెడ్డి, నాగరాజు, సిపిఎం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు తెలిసిన వారినే చట్ట సభకు పంపించండి
నవ తెలంగాణ – పటాన్ చెరు
కార్మికుల సమస్యలు తెలిసిన వారినే చట్టసభకు పంపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే రాజయ్య ఓటర్లను కోరారు. సీపీఎం అభ్యర్థి జె.మల్లికార్జున్ను గెలిపించాలని కోరుతూ గురువారం మండలంలోని చిట్కుల్, పాశమైలారంలోని వివిధ పరిశ్రమల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కే రాజయ్య మాట్లాడుతూ సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా కార్మికుల సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగిన నాయకులు మల్లికార్జున్ అని అన్నారు. పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికుల సమస్యలన్నీ తెలిసిన సీపీఎం అభ్యర్థిని గెలిపించాలన్నారు, మిగతా వాళ్లు ఏనాడూ కార్మికుల సమస్యలపై ప్రశ్నించలేదని, పోరాడలేదని అన్నారు. సీపీఎం అభ్యర్థిని గెలిపిస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, నాగప్రసాద్, మల్లేశం, మహేశ్వర్ రెడ్డి, శంకర్, లకన్, రాములు, లోకేశ్వర్ రెడ్డి, వెంకట్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక నాయకుడిని గెలిపించాలి
నవ తెలంగాణ – అమీన్ పూర్
సీపీఎం సుత్తి కొడవలి చుక్క గుర్తుపై ఓటు వేసి కార్మిక నాయకుడు జె.మల్లికార్జున్ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. గురువారం అమీన్పూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీ, పటేల్ గూడా, ఐలాపూర్, ఐలాపూర్ తండాలో సీపీఎం నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామాల అభివద్ధి, ప్రభుత్వ భూముల రక్షణ, ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల కల్పన, ఉచిత విద్య.. వైద్యం కోసం పోరాడేది ఎర్రజెండానేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం పటాన్చెరు నియోజకవర్గం కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మహిపాల్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్, సిఐటియు నాయకులు, బంగారు రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రారెడ్డి నగర్లో సీపీఎం ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ రామచంద్రాపురం
పటాన్చెరు సీపీఎం అభ్యర్థి జె.మల్లికార్జున్ను గెలిపించాలని కోరుతూ గురువారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలను పంచుతూ పారిశ్రామిక వాడలో ప్రచారం చేశారు. సీపీఎం అభ్యర్థి మల్లికార్జున్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలోఅశోక్ ,బాబురావు, సురేష్, శ్రీధర్ గౌడ్, చంద్రయ్య ,మహేష్, మైపాల్, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు.