నవతెలంగాణ హైదరాబాద్: రేపు తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది. నవంబర్ 3 నుంచి నోటిఫికేషన్ ప్రారంభం కానున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించనుంది. ఇందుకోసం ఈసీ బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానున్న ఈసీ బృందం.. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం పాల్గొంటారు.
ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానున్న ఈసీ బృందం.. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్షించనుంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, అధికారులతో గురువారం టెలీకాన్ఫరేన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు, తదితరాలపై చర్చించనన్నారు.