నవతెలంగాణ హైదరాబాద్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే కాదు.. శిక్షార్హం కూడా. ఎవరైనా ఇలా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఎన్నికల అధికారులు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తారు. పోలింగ్ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే.. ఆ ఓటు రద్దు అయినట్లే లెక్క. అంధులు ఓటు వేసేందుకు 18 ఏళ్లు దాటిన సహాయకుడిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. అంధుడి ఓటును బహిరంగ పరచనని సహాయకుడు సంబంధిత పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటుహక్కు వినియోగించుకున్న వారిని మాత్రమే అంధుల సహాయకులుగా అనుమతిస్తారు.