– హిందీ రాష్ట్రాల్లో హామీలు కురిపిస్తున్న పార్టీలు
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు పుంఖానుపుంఖాలుగా హామీలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా అన్నదాతలపై ఎక్కడ లేని ప్రేమ కుమ్మరిస్తున్నాయి. చందమామను నేలకు దింపేస్తామని నమ్మబలుకుతున్నాయి. మిజోరంలో ఇప్పటికే పోలింగ్ పూర్తికాగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో శుక్రవారంతో ఎన్నికలు ముగుస్తాయి. రాజస్థాన్, తెలంగాణలో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల జనాభాలో రైతుల సంఖ్య అధికంగా ఉండడంతో అన్ని పార్టీలు వారి పైనే దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 66.40%, రాజస్థాన్లో 70%, ఛత్తీస్గఢ్లో 66.80% కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడినవే. రైతులు ఓ కులానికో లేదా ఓ మతానికో చెందిన వారు కారు. వారిలో అన్ని కులాలు, మతాల వారూ ఉన్నారు. వృత్తి పరంగా వీరి సంఖ్యే అధికంగా ఉండడంతో పార్టీలు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు అన్నదాతల కోసం పలు పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కనీస మద్దతు ధరల్ని పెంచాలన్న డిమాండ్ గట్టిగా విన్పిస్తోంది. ఈ మూడు హిందీ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఆహార ధాన్యాల విలువలో మధ్యప్రదేశ్ వాటా 8.93%. పప్పు ధాన్యాల విలువలో ఆ రాష్ట్ర వాటా 18.64%. చమురు గింజల విలువలో దాని వాటా 11.77%. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి విలువలో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. చమురు గింజల పంటల ఉత్పత్తి విలువలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. ఈ మూడింటి ఉత్పత్తి విలువలో ఛత్తీస్గఢ్ది మూడో స్థానమే. క్వింటాలు ధాన్యానికి మధ్యప్రదేశ్లో రూ.2,500, ఛత్తీస్గఢ్లో రూ.3,200 కనీస మద్దతు ధర ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ ఇచ్చిన హామీ ధర కంటే ఇది వంద రూపాయలు అధికం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దేశీయంగా ప్రకటించిన ఎంఎస్పీ రూ.2,183 కంటే ఎక్కువగానే ఇస్తా మని ఛత్తీస్గఢ్ రైతులకు హామీ ఇచ్చాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువ తక్కువే అయినప్పటికీ అక్కడ వరి పంట ఎక్కువగా పండిస్తారు. అక్కడ వరి పండించే రైతులు ప్రభుత్వ సంస్థలకు ధాన్యం విక్రయిస్తూ అధిక ధర పొందుతున్నారు. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ది ఎనిమిదో స్థానం. కానీ సేకరణలో మూడో స్థానంలో ఉంది.
ఎన్నికలు జరిగే మూడు హిందీ రాష్ట్రాల్లోనూ రాజస్థాన్లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. రాజస్థాన్లో ప్రధానంగా చమురు గింజల పంటల్ని సాగు చేస్తున్నారు.
అయితే వాటి కనీస మద్దతు ధరలు మాత్రం పెద్దగా పెరగలేదు. పార్టీలు మాత్రం తమ ప్రచారంలో రుణమాఫీపై హామీలు ఇస్తున్నాయి. సహకార బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. రాజస్థాన్ రైతు కుటుంబాల్లో అత్యధిక కుటుంబాలు రుణ భారంతో సతమతమవుతున్నాయి. రాష్ట్రం లోని 60.3% రైతు కుటుంబాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకున్నాయి. మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఛత్తీస్గఢ్ రైతు కుటుంబాలే తమ ఆదాయాలతో ఎక్కువ సంతో షంగా ఉన్నాయి. ప్రతి వెయ్యి మందిలో 685 మంది తాము సంతోషంగానే ఉన్నామని చెప్పారు.