– కార్మికొద్యమాలనే తన ఊపిరిగా మలుచుకున్న మహోన్నతమైన నేత మన పర్సా
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంటేశ్వర్
కార్మికు ఉద్యమ లెజెండ్ మన పర్స సత్యనారాయణ అని కార్మికోద్యమాలే తన ఊపిరిగా మలుచుకున్న మహోన్నతమైన నేత మన పరస సత్యనారాయణ అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం22-5-2023 న 8 వ వర్ధంతి సిఐటియు కార్యాలయంలో పర్సా సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా పర్సా ఫోటో కు పూలమాలవేసి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములులు పర్సా ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. అమరజీవి పర్సా సత్యనారాయణ 1924లో వెంకటసుబ్బమ్మ, వెంకమరాజు దంపతులకు జన్మించారు. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురాడపిల్లల్లో ఆయన కడగొట్టు సంతానం. గుంటూరు జిల్లా పూర్వపు సత్తెనపల్లి తాలూకాలోని కంభపాడు వారి స్వగ్రామం. తన పదో ఏట వచ్చేవరకూ పర్సా స్వగ్రామంలో ఉన్నారు. తర్వాత అదే జిల్లా తెనాలి ప్రాంతంలోని నందివెలుగులో ఉన్న స్కూలు టీచరైన మేనమామ ఇంటికి వెళ్లారు. 1938 వరకూ ఆయన మేనమామ వద్ద, ప్రైవేటు మాస్టారు పుట్రేపు భరతయ్య వద్ద చదువుకున్నారు. తర్వాత దుగ్గిరాల హైస్కూల్లో థర్డ్ ఫారమ్ చదివారు. కాంగ్రెస్ సత్యాగ్రహి బడ్డేపల్లి సోమయాజులు సాయంతో ఆయన గుంటూరులో ఎస్ఎస్ఎల్సిలో చేరారు. సోమయాజులు సాయానికి ప్రతిగా ఆయన ఏజెన్సీలు నిర్వహించే ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలను పర్సా చందాదారులకు పంపిణీ చేశారు. ఎస్ఎస్ఎల్సి పరీక్షా ఫలితాలు రాకపూర్వమే తూములూరులో ఉన్న మరో మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ ఇంటి ఎదుటే ఓ లైబ్రరీ ఉండేది. అందులో రోజూ పుస్తకాలు చదువుతుండేవారు. సెలవులు పూర్తవడంతో తన అన్నతో కలిసి నాటి వరంగల్ జిల్లాలోని కొత్తగూడెం(ప్రస్తుతం ఖమ్మం జిల్లా) వెళ్లారు. అక్కడ మరో అన్న, భూస్వాములైన పటేల్ పట్వారీల వద్ద గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లిదండ్రులూ అక్కడే ఉండేవారు. కొద్దికాలం తరువాత తండ్రి వెంకమరాజు జబ్బు పడి చనిపోయారు. పర్సకు కారేపల్లిలో ఓ పాఠశాల ఉపాధ్యాయునితో పరిచయం ఏర్పడింది. ఆయన పర్సా నుంచి ఇంగ్లీషు నేర్చుకుంటూ తాను పర్సాకు ఉర్దూ భాష నేర్పుతుండేవారు. పర్సా అక్కడి గ్రామస్తులతో పరిచయాలు పెంచుకున్నారు. గ్రామస్థులు పర్సాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. మిన్నికంటి పర్వతాలు అనే మిత్రుడు పర్సాకు ఉద్యోగం వచ్చే వరకూ తనింటిలోనే ఆశ్రయం కల్పించాడు. పర్వతాలు సింగరేణిలో బర్లీఫిట్ గనిలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఓ రోజున ఆయన పర్సను సింగరేణి హెడ్డాఫీసులో గుమాస్తాగా పనిచేసే దేవూరు శేషగిరిరావుకు పరిచయం చేశాడు. సింగరేణిలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించేందుకు సుందరయ్య ఆయనను కొత్తగూడెంకు పంపారు. ఆయన పరిచయంతో పర్స ఉద్యోగం సంపాదించారు. రామవరం నెం.2 ఇంక్లెయిన్(ఎ 1-2)లో పని చూపారు. ఆ రోజుల్లో కార్మికులు గనిలో కందిల్(కిరోసిన్ దీపం)తో పనిచేసేవారు. పర్సకు స్టోరు నుంచి కార్మికులకు కిరోసిన్ ఇచ్చే గుమాస్తా ఉద్యోగమిచ్చారు. దీపాలకూ, యంత్రాలకూ కావలసిన ఆయిల్స్ ఇచ్చే ‘ఆయిల్ ఇష్యూయర్’ ఉద్యోగం ఆయనది. తర్వాత కొన్నాళ్లకు కార్మికులు విధి నిర్వహణకు వచ్చేటప్పుడూ, వెళ్లేటప్పుడూ రెండుసార్లూ వారికి మస్టరు వేసే పనికూడా ఆయనకే కేటాయించారు. కొంతకాలం అయ్యాక కార్మికుల మస్టర్ల ఆధారంగా వారికి బియ్యం, జొన్నలు, గోధుమలు రేషన్ ఇవ్వడం ప్రారంభించారు. వీటికి సంబంధించిన రేషను టోకెన్లు కూడా పర్సనే ఇచ్చేవారు. ఈ బాధ్యతలు 1943 నుంచి 1946 వరకూ నాలుగేళ్లపాటు నిర్వహించారు. అప్పటికాయన వయస్సు 19 ఏళ్లు. అక్కణ్నుంచే ఆయనకు కార్మికోద్యమంతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రారంభంలోనే రహస్యంగా పని చేయాల్సి వచ్చింది. అది రెండో ప్రపంచ యుద్ధకాలం. ఆ కాలంలో కోల్, రైల్వేల్లో ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించడానికి వీల్లేదు. కోల్లో మరింత నిషేధాజ్ఞలు ఉండేవి. రాజకీయ, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు ఒప్పుకునేవారు కాదు. ఉద్యోగం బహిరంగంగానూ, ట్రేడ్యూనియన్ నిర్మాణం అజ్ఞాతంగానూ చేయాలి. శేషగిరిరావు పర్సాను మంచి కుర్రాడు అనుకునేవారు. పర్స పనిచేసే డిపోలోనే సమయ్య అనే సమ్ములు.. శేషగిరిరావు కాంటాక్టులో ఉండేవాడు. సమ్ములుకు శేషగిరిరావు పార్టీ సభ్యత్వమిచ్చారు. 1943 చివరిలో సమ్ములు ద్వారా పర్సాకు పార్టీ సభ్యత్వం వచ్చింది. తర్వాత కొంతకాలానికి పర్సాను టౌన్ కమిటీలోకి తీసుకున్నారు. 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహాసభ జరిగింది. దీనికి దేవూరు శేషగిరిరావు పర్సాను వాలంటీరుగా పంపారు. పర్సా అదేయేడు బెజవాడలో అఖిల భారత కిసాన్సభ మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగానే ఆయన అనేకమంది కమ్యూనిస్టు నాయకులను ప్రత్యక్షంగా చూశారు. కవి దాశరథి కృష్ణమాచార్యులుతో అప్పుడే పరిచయమేర్పడింది. సభకు వచ్చే సందర్భంగా రైల్లో పోగు చేసిన విరాళాలను నాటి కమ్యూనిస్టు నేత పిసి జోషికి అందజేశారు. తర్వాత కాలంలో సింగరేణిలో యూనియన్ కార్యకలాపాలు బహిరంగంగానే నిర్వహించడం మొదలుపెట్టారు. యూనియన్ను నడుపుతున్న కీలక వ్యక్తులు దేవూరి శేషగిరిరావు, టి.చలపతిరావు(తర్వాత కాలంలో సినీ సంగీత దర్శకులుగా పేరు గడించారు), పర్స సత్యనారాయణ అని సింగరేణి యాజమాన్యం తెలుసుకుంది. 1945 జూన్ 16న కొత్తగూడెంలో యూనియన్ ఏర్పాటైంది. కొత్తగూడేనికి రెండు కిలోమీటర్ల దూరంలో హేమచంద్రపురం గ్రామం ఊరిచివర ఓ పాఠశాల భవనంలో యూనియన్ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి 200 మంది వరకూ కార్మికులు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన యూనియన్కు ఆంధ్ర మహాసభ నాయకుడు సర్వదేవభట్ల రామనాథంను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.(రామనాథం వరంగల్ ఆజాంజాహి మిల్లు యూనియన్కు కూడా నాయకుడుగా ఉన్నారు) యూనియన్ ప్రధాన కార్యదర్శిగా దేవూరి శేషగిరిరావు, ఆర్గనైజింగు కార్యదర్శిగా టి.చలపతిరావు, కమిటీ సభ్యుడుగా పర్స ఎన్నికయ్యారు. కంపెనీలో యూనియన్ కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ యాజమాన్యం చూపు పర్సాపై పడింది. డ్యూటీ అవర్స్లో యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ, యూనియన్ ఆఫీసులో చేయాల్సిన పనిని కంపెనీలో చేస్తున్నాడనీ అభియోగం మోపి పర్సాను పని నుంచి తొలిగించారు. దీంతో కంపెనీలో పెద్ద అలజడి నెలకొంది. పర్సాను పనిలోకి తీసుకోవాలని సుమారు నాలుగైదు వేల మంది కంపెనీ హెడ్డాఫీసు (కొత్తగూడెంలో ఉంది) ముందు బైఠాయించారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. తిరిగి పనిలోకి తీసుకుంది. తర్వాత యూనియన్ కార్యాలయం నిర్మాణం కావడంతో అక్కడ పనిచేసేందుకు పర్సా ఉద్యోగానికి రాజీనామా చేసి యూనియన్ బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగంలో ఉన్న సమయంలోనే తెనాలి తాలుకా ఈపూరుకు చెందిన భారతీదేవితో వివాహమైంది. 1946లో మేడేను మొదటిసారి యూనియన్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. 1947 చివర్లో అరెస్టయిన పర్సా 1953 వరకూ జైల్లోనే ఉన్నారు. 1949 మార్చిలో ఔరంగాబాద్ జైలు నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఎఐటియుసిలో చురుగ్గా పని చేశారు. 1970లో సిఐటియు స్థాపించే వరకూ అలానే కొనసాగారు. 1962లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1966లో రాజీనామా చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగానూ పనిచేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పర్యా సత్యనారాయణ కార్మికోద్యమ నేత స్థాయి వరకు ఎదిగి ప్రజలకు సేవలందించారు.
చివరిగా పర్సా అంత్యక్రియలు కొత్తగూడెం పట్టణంలో జరిగాయి. సిపిఎం కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. ఆ అంత్యక్రియల్లో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బీవీ రాఘవులు, పాల్గొన్నారు, కుటుంబ సభ్యులు అన్ని వర్గాల ప్రజలు ఎర్ర జెండాలు అవనతం చేస్తూ కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ తో, పర్సా ఆశయ లను సాధనపై నినాదాలతో పట్టణం అంతా చిన్న బోయింది. అలా అంతిమ యాత్ర కొనసాగింది. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ పర్సా సత్యనారాయణ ఆశయం కార్మిక రాజ్యం సాధన కోసం పనిచేశారు. అదేస్ఫూర్తితో కార్మిక ఉద్యమాన్ని. మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు కృష్ణ జిల్లా నాయకులు నరసయ్య ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుజాత ఐద్వా ఉపాధ్యక్షురాలు అనిత ఐద్వ నగర అధ్యక్షురాలు కటారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.