– ఒక్కొక్కళ్లు తుపాకీ గుండులా, సివంగిలా తయారవ్వాల
– పోరాడితేనే మన బతుకులు మారతాయి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి
నవతెలంగాణ-సత్తుపల్లి
కమ్యూనిస్టుల బలమేంటో ఈ సార్వత్రిక ఎన్నికల ద్వారా నిరూపించుకుందామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్.పుణ్యవతి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం సత్తుపల్లి మండలంలోని తాళ్లమడ, సిద్దారం, గౌరిగూడెం, సదాశివునిపాలెం, తుంబూరు, కిష్టాపురం, నారాయణపురం, బేతుపల్లి, గంగారం గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పుణ్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కమ్యూనిస్టులకు బలం తగ్గిపోయిందనే భావనలో బూర్జువా పార్టీలు ఉన్నాయన్నారు. కమ్యూనిస్టుల బలం తగ్గలేదనే విషయాన్ని ఈ ఎన్నికల్లో మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఒక తుపాకీ గుండులా, ఒక సివంగిలా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మన కుటుంబాల ఓట్లతో పాటుగా మన బంధువులు, స్నేహితుల ఓట్లను కూడా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మన అభ్యర్థులకు వేసేలా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. కమ్మూనిస్టులు చట్టసభల్లో ఉంటేనే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలను నిలదీస్తారనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాన్నారు. కనీస వేతన చట్టాలు అమలు కావడం లేదన్నారు. పనికితగ్గ కూలి గిట్టడం లేదన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఉపాధి కూలి రూ. 100 దాటడం లేదన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాల ద్వారానే అవి సాధ్యపడతాయన్నారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న సామెతలా మనం ఉద్యమం చేస్తేనే పాలకులు దిగివస్తారన్నారు. గతంలో నిర్వహించిన అనేక పోరాటాల ద్వారానే మనం అనేక హక్కులు, చట్టాలను సాధించుకున్న విషయాన్ని పుణ్యవతి గుర్తు చేశారు. సత్తుపల్లి అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి మాట్లాడుతూ ఎన్నడూ ప్రజల మధ్యకు రాని వాళ్లొచ్చి మనల్ని ఓట్లడుగుతున్నారన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసి కేసులై, జైలుకు వెళ్లిన ఉదంతాలు వాళ్లకు ఏనాడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఎక్కడ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అక్కడ కమ్యూనిస్టు ప్రత్యక్షమవుతాడన్నారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరితపించే నిత్య శ్రామికుడు కమ్యూనిస్టేనని భారతి స్పష్టం చేశారు. ప్రజల కోసం పాటుపడే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలన్నారు. కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉన్ననాడే ప్రజల బాధలు ప్రభుత్వాలకు తెలుస్తాయన్నారు. అనేక పోరాటాలు చేసిన ఉద్యమ చరిత్ర తనకు ఉందని భారతి అన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ స్థానం సీపీఐ(ఎం) తరపున పోటీచేస్తున్న నాకు సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని భారతి ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, రావుల రాజబాబు, బాలబుచ్చయ్య, ఐద్వా జిల్లా నాయకురాళ్లు మెరుగు రమణ, జాజిరి జ్యోతి, పాకలపాటి ఝాన్సీ, శీలం పకీరమ్మ, తెనాలి పుష్ప. నాయకులు కువ్వారపు లక్ష్మణరావు, రవి, శ్రీను, రాములు, పాఠాన్ రోష్ని పాల్గొన్నారు.