– మొన్న రమాదేవి..నిన్న తుల ఉమ.. నేడు విజయశాంతి గుడ్బై
– రాజీనామా చేసిన రజిని
– దూరంగా ఉంటున్న జీవిత రాజశేఖర్
– పెద్దగా కనిపించని ఇతర మహిళా నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్లో మహిళా బిల్లు తెచ్చామని ఓవైపు బీజేపీ గొప్పలకు పోతుండగా..మరోవైపు మహిళా నేతలు ఆ పార్టీకి ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. వారు పోతూపోతూ మహిళలకు ఆ పార్టీలో గౌరవం లేదని దుమ్మెత్తిపోస్తు న్నారు. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల్లో ముదోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమాదేవి పోటీచేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆమెకు 40,602 ఓట్లు లభించాయి. ఆమె నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఈసారీ తనకే ఆ నియోజకవర్గం నుంచి టికెట్ లభిస్తుందని ఆమె ఆశించారు. కానీ, బీజేపీ అధిష్టానం ఆమెకు టికెట్ను నిరాకరించింది. ఇన్నేండ్లు పార్టీకోసం కష్టపడ్డ తనకు సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై దుమ్మెత్తి పోస్తూ రాజీనామా చేశారు. మీడియా ముందే బాధను తట్టుకోలేక ఏడ్చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా తుల ఉమ పనిచేశారు. టీఆర్ ఎస్లో మహిళా విభాగం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు కౌన్సిలర్గా గెలిచేనాటికే ఆమె జిల్లా రాజకీయాల్లో కీలక నేత. ఆ తర్వాత ఈటల రాజేందర్తో పాటు ఆమె కూడా బీజేపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో వేములవాడ సీటు కావాలని కూడా స్పష్టంగా పార్టీకి చెప్పారు. గొల్లకురుమ సామాజిక తరగతిలో పట్టున్న మహిళా నేతగా కూడా ఆమె గుర్తింపు పొందారు. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతనే ఆమెను బీజేపీ అధిష్టానం వేములవాడ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, జాతీయ నాయకత్వంపై కీలక నేతల ఒత్తిడితో ఆమెకు బీం ఫాం ఇవ్వకుండా బీజేపీ ఘోరంగా అవమానించింది. ఈ విషయంలో తుల ఉమ కూడా కన్నీరు పెట్టారు. పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఇక కంటోన్మెంట్లో బీజేపీ నుంచి రజిని టికెట్ ఆశించారు. కానీ, ఆ పార్టీ అనూహ్యంగా చివరి విడతలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన గణేశ్ నారాయణ్కు కేటాయించింది. దీనిపై రజిని కంట కన్నీరు పెడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ తమను నాయకులు నట్టేట ముంచారనీ, టికెట్ అమ్ముకున్నారని దుమ్మెత్తిపోశారు.
మొదటి నుంచీ అసంతృప్తిలోనే విజయశాంతి
కాంగ్రెస్ నుంచి మూడేండ్ల కింద బీజేపీలో చేరిన విజయశాంతి రెండేండ్ల నుంచి అసంతృప్తితో రగిలిపోతు న్నారు. బండి సంజరుని అధ్యక్ష స్థానం నుంచి మార్చిన తర్వాత అది మరింత తీవ్రమైంది. పార్టీ తన సేవలను వాడుకుంటలేదని ఆమె బాహాటంగానే విమర్శలు ఎక్కు పెట్టింది. నేతల తీరుపై పరోక్షంగా ఎక్స్(ట్విట్టర్)లో తన వ్యతిరేక గళాన్ని వినిపించారు. రాష్ట్ర కార్యవర్గ సమా వేశానికీ డుమ్మాకొట్టారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షులు నడ్డా సభలకూ హాజరు కాలేదు. అయినా, ఆమెను జాతీయనాయకత్వం విస్మరి స్తూనే వచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె పేరే చేర్చలేదు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆమె ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకపో వడంతో సినీనటి జీవిత రాజశేఖర్ కూడా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీలోని మహిళా నేతలు ప్రచార పర్వంలోనూ పెద్దగా కనిపించడం లేదు. స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ కూడా అంతగా కనిపించడం లేదు. అసలు ప్రాధాన్యత లేని, ఓడిపోయే చోట మహిళా అభ్యర్థులను ప్రకటించారనే విమర్శ బీజేపీపై ఉంది. ‘ఆడబిడ్డల కన్నీరు ఇంటికి మంచిదికాదు. వారిని ఏడ్పిస్తే అంతా చెడు జరుగుతుంది. అత్యంత ఆధ్యాత్మిక చింతనతో పనిచేస్తున్నామనే బీజేపీ తీరు నష్టానికే తప్ప మంచికి కాదు’ అని మహిళా నేతలు బాహాటంగానే అంటున్నారు.