నవతెలంగాణ-మరిపెడ
మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధి పేరుతో రూ.కోట్ల నిధులను చైర్మన్, వైస్ చైర్మన్ లకు తెలియకుండానే కాజేశారని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆరోపించారు. మంగళవారం మరిపెడ లో రెడ్డి, ముదిరాజ్, దళిత సామాజిక వర్గం వర్గానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో రూ.10 కోట్ల నిధులు, 2022లో రూ.20 కోట్ల నిధులు వచ్చినట్లు సమాచారం ఉందని తెలిపారు. చైర్మన్ వైస్ చైర్మన్లు మంచివారే అయినప్పటికీ పాపం వారికి తెలియకుండానే ఆ నిధులను దారి మళ్లించినట్లు ఆయన ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అవినీతి జరిగిందని దీని వెనకాల షాడో ఎమ్మెల్యే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు మరొకరు బినామీ ఉన్నారని ఆరోపించారు. ఈ మున్సిపాలిటీకి సంబంధం లేని వారు మున్సిపాలిటీపై పెత్తనం కొనసాగిస్తున్నారని విమర్శించారు. అత్యధిక జనాభా గలిగిన మరిపెడ దళిత కాలనీకి దళిత బంధు సక్రమంగా అందలేదని, అందులో తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కు డోర్నకల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ఆమెకు కానుకగా ఇవ్వాలని కోరారు. భారీ మెజార్టీతో గెలిపించాలని రామచంద్రనాయక్ కార్యకర్తలను కోరారు. అనంతరం మండలంలోని ఎడ్జర్ల, గుర్రపు తండా, లచ్య తండా, ధర్మారం, పురుషోత్తమాయగూడెం, దారవత్ తండ, అమతండా, గాలివారిగూడెం, అబ్బాయి పాలెం, తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గండి బాబు, మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, అబ్బాయి పాలెం ఎంపీటీసీ బుజ్జి బద్దు నాయక్ ,మాజీ ఎంపీటీసీలు గంధసిరి అంబరీష, అండమ్మ, కృష్ణమూర్తి, జిల్లా నాయకులు రవి నాయక్, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, అప్సర్ పాష, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగాని వేణు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు బి.రవి కిరణ్, తదితరులు ఉన్నారు.