– స్వతంత్ర అభ్యర్థుల ఓట్లపై విశ్లేషణలు
– నష్టం చేకూరేలా ఉంటే విత్డ్రా కోసం విజ్ఞప్తి
– మేలు జరిగేలా ఉంటే ప్రోత్సాహం
– బేరీజు వేసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
– వక్ఫ్బోర్డు బాధితుల నామినేషన్లు
స్వతంత్ర అభ్యర్థుల వల్ల తమకు నష్టమా..? లాభమా..? వారు బరిలో ఉంటే తమకు పడాల్సిన ఓట్లు చీలిపోతాయా..? లేదంటే వ్యతిరేకత ఓటు చీలిపోయి మేలు రుగుతుందా..? ఇలా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు లోతైన విశ్లేషణల్లో నిమగమయ్యారు. తమ గెలుపు కోసం పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళుతున్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్నీ నిర్లక్ష్యం చేయడం లేదు. నష్టం చేసే అవకాశాలున్న చోట్ల స్వతంత్రులతో నామినేషన్లు ఉపసంహరించు కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లాభం చేకూర్చే అవకాశాలుంటే బరిలో ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. మేడ్చల్ పరిధిలో వక్ఫ్బోర్డు బాధితుల నామినేషన్లు అధికంగా ఉన్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నామినేషన్లు, పరిశీలన పర్వం ముగిసింది. ప్రస్తుతం ఉపసంహరణ కొనసాగుతోంది. మేడ్చల్-మల్కా జిగిరి జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకుగా ను అన్ని చోట్ల స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు స్వతంత్రులు తమ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు నామినేషన్లు దాఖలు చేయగా.. మరికొందరు ప్రతి ఎన్నికల్లో బరిలో ఉండాలని నామినేషన్లు వేశారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని..
గతంలో స్వతంత్ర అభ్యర్థుల కారణంగా కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మారిపోయింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తును పోలిన గుర్తులు వీరికి కేటాయించడంతో తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వక్ఫ్బోర్డు బాధితుల మూకుమ్మడి నామినేషన్లు
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 116 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 85నామినేషన్లు బోడుప్పల్ వక్ఫ్బోర్డు బాధితుల వే. వీరంతా మంత్రి మల్లారెడ్డిపై వ్యతిరేకతతో బరిలో నిలిచారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్ఎన్ఎస్కాలనీ, పెంటారెడ్డికాలనీ, మారుతీ నగర్, ఘట్కేసర్కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల్లో ప్రజలు నాలుగేండ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నెంబర్లలో 300 ఎకరాలు, ఘట్కేసర్ పరిధిలో 10 ఎకరాల భూమి ఉంది. 40 ఏండ్ల కిందట అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. దాదాపు 80 కాలనీల్లో 7 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు అన్నీ వక్ఫ్ భూముల్లో ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టారు. 2022లో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీల్లో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జేఏసీ తరఫున పోరాటాలు చేసినా పాలకులు, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 89 నామినేషన్లు వేశారు. కాగా ఏండ్ల కిందట చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వక్ఫ్బోర్డు బాధితులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలను వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని అప్పటి నుంచి బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు.
బ్యాలెట్ యూనిట్లు పెంచాల్సిన పరిస్థితి..
బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగితే బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణీత సంఖ్యలోపు అభ్యర్థులుంటే ఒక్క బ్యాలెట్ యూనిట్తో సరిపెట్టొచ్చు. కానీ ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ యూనిట్లను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఓటర్లు అభ్యర్థుల గుర్తులను వెతుక్కోవడంలో కొంత మేరకు అయోమయం నెలకొనే అవకాశం ఉంది.
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు..
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 15న (నేడు) మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మంది స్వతంత్రుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తే అధిక మెజారిటీ సాధించొచ్చని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. స్వతంత్రులను కలిసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.