– నిస్వార్థ ప్రజా సేవకుడు కారం పుల్లయ్యను అసెంబ్లీకి పంపించండి
– మాజీ ఎంపీ మీడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు రాజకీయ పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు కోరారు. భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరోనా కష్టకాలంలో భద్రాచలంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి సుమారు 300 మంది కరోనా రోగులను వైద్యాన్ని అందించిన చరిత్ర సీపీఐ(ఎం)కు ఉందని అదే కరోనా సమయంలో ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలలో బుద్ధి చెప్పాలని కోరారు. వరదల సమయంలో బాధితుల పక్షాన పోరాడిన సీపీఐ(ఎం)ను ఆదరించి భద్రాచలం వరద ముంపునకు కారణం అయిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోదాం వీరయ్య గాని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మాలోత్ కవిత కానీ ఏమాత్రం అభివృద్ధి చేయటం లేదని విమర్శించారు. గతంలో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధుల నిజాయితీ చరిత్రను నేటితరం యువకులు తెలుసుకొని డబ్బు, మందు పంచి గెలవాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు యువత బుద్ధి చెప్పాలని కోరారు. భద్రాచలం నియోజవర్గంలో పార్టీకి రోజురోజుకీ ఆదరణ అంతకంతకు పెరుగుతుందని పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు సీపీఐ(ఎం)కే తమ ఓటు వేస్తామని మద్దతు తెలుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మర్లపాటి రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, నాదెండ్ల లీలావతి, జోన్ కన్వీనర్ బెల్లంకొండ కుసుమ, సీనియర్ నాయకులు బిబిజి తిలక్, శాఖా కార్యదర్శులు వేణు, సక్కుబాయి, కాకా రమణా, తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.