– సమరశీల ఉద్యమాల్లో ముందున్న సీపీఐ(ఎం)
– పలుమార్లు సీఎం, మంత్రులు, అధికారులకు వినతి
– రోడ్ల దిగ్బంధనంతో దిగొచ్చిన ప్రభుత్వం
– 1.51 లక్షల మందికి 4.06 లక్షల ఎకరాల పంపిణీ
– ఆ భూములకు రైతుబంధు, ఉచిత విద్యుత్ వర్తింపు
గెలిచావా? ఓడావా? అనే దానికంటే అసలు యుద్ధం చేశావా? లేదా? అనేది ముఖ్యమన్నాడు ‘చే’. అవి చట్టసభల ఎన్నికలైనా, ప్రజాక్షేత్రంలో ఉద్యమాలైనా యుద్ధానికి వెనుకాడని యోధులు కమ్యూనిస్టులు. గెలుపోటములకు అతీతంగా ప్రజాకంఠకులను, వారికి వత్తాసు పలికే ప్రభుత్వాలను, వాటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రతిఘటించేది, ప్రజా పోరాటాలను నిర్మించేది కమ్యూనిస్టులే. అలాంటి పోరాటాల సారథిగా సీపీఐ (ఎం)ది విరామమెరుగని కృషి. గత ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలోని పేదలు, సామాన్యులు, కార్మికులు, కర్షకుల గెలుపు కోసం సీపీఐ (ఎం), దాని అనుబంధ సంఘాలు నికరంగా పోరాడాయి. ఆ పోరాటాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అందులో విజయాలూ ఉన్నాయి. నవతెలంగాణ ఆ ‘పోరాట విజయాలను’ నేటి నుంచి మీకందిస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కమ్యూనిస్టులు కేవలం ఎన్నికలకే పరిమితం కారు. పోరాటాల ద్వారా ప్రజలకు మేలు చేస్తారు. వారి అంతిమ లక్ష్యం ప్రజా క్షేమమే. సాధ్యమైనంత వరకు సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి సమస్య లోతుపాతులను తీసుకెళ్లి చర్చల ద్వారా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అది సాధ్యం కానప్పుడే అనివార్యమైన పరిస్థితుల్లోనే పోరాటాలకు సమాయత్తమవుతారు. సమస్యలు పరిష్కరించడమే ఈ పోరాటాల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడున్న సమాజంలో పాలకులు, అధికారులు పేదల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలు జరిపినా ఉపయోగం లేనప్పుడు… ఎంతకూ పేదల సమస్యలు పరిష్కారం కానప్పుడు మాత్రమే పోరాటాలు అనివార్యమవుతున్నాయి. బూర్జువా పార్టీల నాయకులు పైరవీల పేరుతో పేదల జేబులు కొల్లగొడతారు. పోరాడి సాధించుకోవడం ప్రజల హక్కు అని కమ్యూనిస్టులు చెప్తారు. అందుకే పోరాడే ప్రజలు ఎర్రజెండాను ఆశ్రయిస్తారు. పేదల కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా కమ్యూనిస్టులు సిద్ధంగా ఉంటారు.
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గం
పోడు భూముల సమస్యను బీఆర్ఎస్ ప్రభుత్వం నాన్చుతూ వచ్చింది. ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన మాటతప్పింది. అనేక సార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా, చర్చించినా ఫలితం లేదు. అందుకే సీపీఐ(ఎం) అనేక సమరశీల పోరాటాలు నిర్వహించింది. అయినా పాలకులు స్పందించలేదు. ఇతర వామపక్షాలు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేసింది. 2021, అక్టోబర్ 5న అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్లను దిగ్బంధనం చేసింది. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. పోడు భూముల సమస్య పరిష్కారానికి ముందుకొచ్చింది. జూన్ 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,51,146 మంది ఆదివాసీ గిరిజనులకు 4,06,369 ఎకరాల భూమికి పోడు పట్టాలను పంపిణీ చేసింది. అయితే అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 13 లక్షల ఎకరాలకు 3.5 లక్షల మంది హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారందరికీ హక్కు పత్రాలివ్వకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 11.5 లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలిస్తామంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అసెంబ్లీలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. దీంతో అర్హులైన అనేక మంది ఆదివాసీ గిరిజనులకు ఇంకా హక్కు పత్రాలు దక్కలేదు. అర్హులందరికీ పోడు పట్టాలు దక్కేదాకా పోరాటం కొనసాగుతుందని సీపీఐ(ఎం) ఇప్పటికే ప్రకటించింది. ముందు ముందు అవి సాధించేదాకా పోరాడేతీరుతుంది. అయితే కమ్యూనిస్టుల సమరశీల పోరాటాలు, ఐక్య ఉద్యమాల ఫలితంగానే ఆదివాసీ గిరిజనులకు ఈ మాత్రమైనా పోడు పట్టాలు దక్కాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలకు వెన్నంటి నిలిచేది కమ్యూనిస్టులే. వారి న్యాయమైన హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడతారు. విజయాలను సాధిస్తారు. అలాంటి విజయాల్లో ఒకటి ఈ పోడు పట్టాల సాధన.
పేదలకు అండ ఎర్రజెండా : ఎస్ వీరయ్య
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి పదిసార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు సీపీఐ(ఎం) అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా అక్కడి ఆదివాసీ గిరిజనులు గెలిపించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య చెప్పారు. అంటే వారికి ఎర్రజెండా అండగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమ్యూనిస్టులు నిరంతరం పోరాడతారని చెప్పారు.