– అఖిల పక్ష రైతు సంఘాల విజ్ఞప్తి
– ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటింది : డీఈ శ్రీనివాసరావు
నవతెలంగాణ- వైరా
వైరా ప్రాజెక్ట్ నీటి మట్టం అడుగంటడంతో ఆయకట్టు పరిధిలో 20 వేల ఎకరాల వరి పంట గింజ పోసుకునేదశలో ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, వెంటనే పాలేరు చెరువు నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఐబీ కార్యాలయం ఎదుట అఖిల పక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు డీఈ శ్రీనివాసరావును కలిసి పరిస్థితి తీవ్రతను వివరించారు. కూత వేటు దూరంలో ప్రాజెక్టు ఉన్నా గండ గలపాడు గ్రామంలో నీరు లేక వరి తెల్ల కంకిగా మారుతుం దని రైతులు వరి దుబ్బులు తీసుకొచ్చి నీటిపారుదల శాఖ డీఈకి చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. పాలేరులో 22 అడుగుల నీరు ఉన్నదని, వైరా ప్రాజెక్ట్ వరి పంట రక్షణకు కనీసం ఒక అర టీఎంసీ విడుదల చేయాలని గత నెల 31న జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావును కలిసి పరిస్థితి వివరించామన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కొత్తగూడెం వచ్చిన సమయంలో కూడా వైరా ప్రాజెక్ట్కు ఏర్పడిన ముప్పును వివరించగా నీరు విడుదలకు హామీ ఇచ్చారని, కానీ ఏ హామీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో నీరు విడుదల చేసి పంటలు రక్షించకపోతే.. ఎన్నికల నిబంధనలను పక్కన బెట్టి ఆందోళనకు పూనుకుంటామని, తమకు పంటల రక్షణ కంటే ఏదీ ముఖ్యం కాదని హెచ్చరించారు. అంతేగాక వైరా నియోజక వర్గంలో పోటీలో ఉన్న అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు పరిస్థితిని వివరించి నీరు విడుదల చేసే వరకు రైతు ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరతామని తెలి పారు. భవిష్యత్లో జరిగే ఆందోళనలో రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొని వరి పంటను రక్షించుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో 14 అడుగుల నీటి మట్టం మించి ఉంటేనే సాగుకు నీరు విడుదల చేయాలని నిబంధనలు విధించారని, అయినా మూడు రోజుల క్రితం వరకు నీరు విడుదల చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 9.9 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉన్నదన్నారు. పాలేరు చెరువు నుంచి తక్షణం ఒక టీఎంసీ నీరు వైరా ప్రాజెక్టులోకి విడుదల అయితేనే 80 శాతం పంట వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, ప్రకృతి కూడా పగ బట్టినట్టు ఉన్నదని, ఒక్క వర్షం కూడా లేకపోవటం నష్టానికి కారణమన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి, రైతుల ఆందోళనను కూడా చెబుతామని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తాతా రంగారావు, వీసీ సత్యనారాయణ, మేడా శరాబంది, గొల్లపూడి హరినాథ్ బాబు, మల్లేంపాటి రామారావు, బాజోజి రమణ, హరి వెంకటయ్య, బెజవాడ వీరభద్రమ్, కురుకుంట్ల శ్రీనివాసరావు, పారుపల్లి కృష్ణారావు, ఇనపనూరి శ్రీను, కామినేని రవి, పల్లెబోయిన కృష్ణ, వడ్లమూడి మధు, తదితరులు పాల్గొన్నారు.