– కారం పుల్లయ్య గెలుపు కోసం విస్తృత ప్రచారం
నవతెలంగాణ-చర్ల
కార్మికులకు ఎర్రజెండా శ్రీరామరక్ష అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సీఐటీయూ మండల అధ్యక్షులు పామర్రు బాలాజీ, కార్యదర్శి సంపత్ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపు కోసం శ్రీ గణేష్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆటోలుకి స్టిక్కర్లు వేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బి.మధు బాలాజీ మాట్లాడారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు సాధన కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యను గెలి పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టానికి చేసిన సవరణలను బీఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచిందని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చిందని, అటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని కార్మికుల సమస్యలు, ప్రజా సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని పేర్కొన్నారు. దళిత బంధు, బీసీ బందు వంటి సంక్షేమ పథకాలు అమ్ముకొని అవినీతిపరుడుగా మారిన అసమర్థ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. పదవుల కోసం వలస వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో కనీస అవగాహన కూడా లేదని ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోకపోతే వాటిని ఎలా పరిష్కారం చేస్తారు అని ప్రశ్నించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ కార్మికులు సాధారణ ప్రజల సమస్యల పైన పోరాడుతున్నది సీపీఐ(ఎం) పార్టీ ఒక్కటేనని, కాబట్టి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేసి కారం పుల్లయ్యని గెలిపించాలని కోరారు. చర్ల మండలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు రావాలన్నా రహదారులు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలు మారుతూ గంటకొక కండువాలు మార్చే నాయకులకు ప్రజా సమస్యలు గుర్తుకు రావని పేర్కొన్నారు. పార్టీలు మారే నాయకులను, అమ్ముడు పోయే అభ్యర్థులను పదవుల కోసం వలస వచ్చిన అసమర్థులను ఓడించాలని సమర్థవంతంగా నీతివంతమైన పాలన ప్రభుత్వాన్ని నిలదీయగలిగే దమ్ము ఎర్ర జెండాకు మాత్రమే ఉన్నాయని కాబట్టి సుత్తి కొడాలి నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి పుల్లయ్యను గెలిపించాలని కోరారు.