నవతెలంగాణ – రాజస్థాన్
ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక తాజాగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంచీకి చెందిన బాధిత విద్యార్థిని నగరంలోని బ్లేజ్ హాస్టల్లో ఉంటూ నీట్కు శిక్షణ పొందుతోంది. కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 25 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.