నవతెలంగాణ-హైదరాబాద్: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలైనా చెబుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈనెల 23న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభకి వచ్చే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగున ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సెల్ ఫోన్ ఛార్జింగ్కు కూడా కరెంట్ సరఫరా కావడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. గెలిచిన కర్నాటకలో కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వడం లేదని.. మరి తెలంగాణ ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేమని ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఐదు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్.. 24 గంటలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… వచ్చే జనవరి నుంచే అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగిస్తామన్నారు. దీంతో అవి పట్టా భూములుగా మారతాయని హరీష్ రావు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేశారన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే రుణమాఫీ డబ్బులు అకౌంట్లలో వేస్తామని.. లేదంటే డిసెంబర్ 3 తర్వాత జమ చేస్తామన్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్కు ఓటేస్తే… పనుల కోసం వికారాబాద్ వెళ్లాల్సి వస్తోందని హరీష్ రావు అన్నారు.