– సీపీఎం జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-మద్దూరు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తరిమికొట్టాలని సీపీఎం జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి, గాగిలాపూర్, మద్దూరు గ్రామాలలో ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం అభ్యర్థి కనకారెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించే సీపీఎం అభ్యర్థి సత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వ పాలనలలో ప్రజా సమస్యలు పెరిగాయి తప్ప పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తోందన్నారు. రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమైందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీ నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే మతకల్లోలాలను సష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలిచేది కేవలం సీపీఎం మాత్రమే అన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడి ఎర్రజెండా నాయకత్వాన దొరలకు ఎదురు నిలిచింది కేవలం ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేసి మోసపోవద్దని, ప్రజల పక్షాన నిలబడే సీపీఎం అభ్యర్థి సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని ఓటర్లను కోరారు. సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, రాళ్ల బండి శశిధర్,దాసరి ప్రశాంత్,జనగామ సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి,సుంచు విజేందర్, చొప్పరి రవికుమార్,కొంగరి వెంకట్ మావో,గొర్రె శ్రీనివాస్, ఇప్పకాయల శోభ,గ్రామ కార్యదర్శి బేజాడి మల్లారెడ్డి పాల్గొన్నారు.