నవతెలంగాణ– ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తామని అంటుంది అలా అయితే రైతు బంధు ఎలా సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గురువారం నాడు ఆదిలాబాద్లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘ధరణితో రైతుబంధు ఇస్తున్నాము. రైతులకు సకాలంలో అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. రైతు కష్టం తెలిసిన వాడిని నేను. ధరణితో ప్రజలకు అధికారం ఇచ్చాము. మీ భూమి హక్కును మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడలేదు. మీ బోటనవేలు ముద్ర పడితే భూమి మారుతుంది. ధరణి తీసివేస్తే లంచాల రాజ్యమే. రైతు బంధు కావాలన్నా.. కరెంట్ కావలన్నా బీఆర్ఎస్ పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కాంగ్రెస్ నేతలు చెప్పే మాయమాటలను నమ్మితే గోసపడుతాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావాలో.. బీఆర్ఎస్ పార్టీ కావాలో గ్రామాల్లో చర్చించండి. ఓటు వేసే ముందు ఆ పార్టీ చరిత్రను చూడాలి. ఎన్నికలల్లో ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్నే గెలిపించాలి’ అని పేర్కొన్నారు.