– సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
– గ్రామాలలో తమ్మినేనికి ఘన స్వాగతం
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
ఈనెల 30న పాలేరులో జరుగుతున్న ఎన్నికల్లో ధన బలానికి, జన బలానికి మధ్య పోటీ జరుగుతుందని, ఈ ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గురువారం మండలంలోని కాకరవాయి, జూపెడ, బచ్చోడు, హస్నాబాద్, సుబ్లేడు గ్రామాలలో విస్తతంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, కోలాట నత్యాలు, మంగళహారతులు, పూలమాలలతో తమ్మినేనికి జనం నీరాజనం పలికారు. ఆయా గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో బూర్జువా పార్టీలు భారత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించేలా, ప్రజాస్వామ్య విలువలను మంట కలిసేలా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేట్ శక్తులు రాజకీయాలలో చేరి కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ యోజనాల కోసం అధికార దాహంతో పూటకో పార్టీ మారుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ వ్యక్తులు చట్టసభలకు వెళ్లడంతో పేదల సమస్యలు పట్టింపు లేదన్నారు. అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై గల మెత్తని వారిని, అవకాశవాదం, డబ్బు మదం, అహంకారంతో రంగులు మార్చే రాజకీయాలను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. పాలేరు ఎన్నికల్లో అవకాశవాద, కార్పొరేట్ వ్యక్తులు పోటీ చేస్తున్నారని, వారు గతంలో ఏ పార్టీలో ఉన్నారో, నేడు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో, రేపు మరే పార్టీలోకి చేరుతారో చెప్పుకోలేని, నమ్మకం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. జనం సమస్యలు మరచి నిద్రపోయే వ్యక్తులకు ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వడం వల్ల ప్రయోజనం శూన్యమన్నారు. జనం వెన్నంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నికరంగా నిలుస్తున్న తనకు ఓటు వేసి గెలిపించడం ద్వారా చట్టసభలలో ప్రజావాణి వినిపిస్తానన్నారు. రాజకీయాలంటేనే పరిచయం లేని వ్యక్తి 2014లో సీపీఐ(ఎం) దయతో ఎంపీగా ఎన్నికై డబ్బు అహంకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లను గెలిచి తీరుతానని శబదాలు చేసే వ్యక్తి, ముందు తన గెలుపు సంగతి ప్రశ్నార్ధకంగా మారుతున్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. పాలేరు ప్రజలు చాలా చైతన్యవంతమైన వారని నీ ఊసరవెల్లి రాజకీయాలను ఇక్కడ పాలేరులో సాగనీయమని, ఇట్లాంటి జంపు జిలానీలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. పార్టీల విధానాలు, సిద్ధాంతాలపరంగా జనం కోసం చిన్ననాటి నుండి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమించి స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం నుంచి వచ్చి నన్ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయాలన్నారు. ప్రజా సమస్యలపై సమగ్రమైన అవగాహన కలిగి జిల్లా సమగ్ర అభివద్ధికై ఐదు నెలలపాటు పాదయాత్రలు చేయడమే కాక దళిత వాడల అభివద్ధికి, సమస్యల పరిష్కారానికి రా ష్ట్రవ్యాప్తంగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్రలు చేశారన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరుతో డిజైన్ చేసి దాని సాధన కోసం 4000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘంగా పాదయాత్రలు చేసి ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. పార్టీలను పక్కనపెట్టి తమ్మినేని పట్ల విశ్వాసంతో పాలేరుప్రజలు ఓట్లు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లడం తప్ప తాను చేసింది ఏమీ లేదన్నారు. ఏనాడు దళిత గిరిజనుల సమస్యలు, ఉపాధి కూలీలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పనిచేసిన వ్యక్తి కాదన్నారు. మరో వ్యక్తి డబ్బు అహంకారంతో ప్రజలను ప్రలోవాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, జిల్లా నాయకులు ఎస్డీ. జియవుద్దిన్, మండల కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, అంగిరేకుల నరసయ్య కొత్తపల్లి వెంకన్న, బింగ్ రమేష్, వశపంగు వీరన్న, పల్లి నాగన్న, పప్పుల ప్రసాద్, మోటపల్లి శ్రీను, పల్లి రమేష్, అన్న బత్తుల సత్తిబాబు, పురం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.